‘సినీ పరిశ్రమలో అందరూ పిరికివాళ్లే ఉన్నారంటూ కొంతమంది ఏపీ రాజకీయ నాయకులు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు. ఇండస్ట్రీ వారికి సిగ్గు, దమ్ములేదు. వారికి బలిసింది అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఇకపై వారి పిచ్చి మాటలను సహించేది లేదు.నాయకుల బెదిరింపులకు ఇండస్ట్రీలో భయపడేవారు ఎవరూ లేరు’ అని అన్నారు దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. తెలుగు సినీ పరిశ్రమపై ఏపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ చేసిన విమర్శలను తమ్మారెడ్డి భరద్వాజ ఖండించారు. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో పిరికివాళ్లు ఎవరూ లేరు. సమస్య వచ్చినప్పుడు వెనుకంజ వేయకుండా ధైర్యంగా పోరాడేతత్వం ప్రతి ఒక్కరిలో ఉంది. సినిమా వాళ్లకు బలిసిందని శాసనసభ్యుడు ప్రసన్నకుమార్ చేసిన మాటలు బాధించాయి.
ఎవరికి బలిసిందో, ఎవరి బలుపును చూసి అలా మాట్లాడుతున్నారో ఆయనే చెప్పాలి. కులమతాలకు అతీతంగా ఉపాధి కల్పించేది ఒక్క సినీ పరిశ్రమ మాత్రమేననే వాస్తవాన్ని ఏపీ నాయకులు గ్రహించాలి. ఇతరుల మెప్పు పొందడం కోసం కులమతాల ప్రస్తావన తీసుకువచ్చి సినీ పరిశ్రమను విడగొట్గడం తగదు. అన్ని సామాజిక వర్గాల ఓట్లతోనే గెలిచారనే సత్యాన్ని వారు గ్రహించాలి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంతా..ఇప్పుడెంతో చెప్పడానికి బహిరంగ చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా అని నాయకులను అడుడుతున్నా.ఎవరు ఎంత తింటున్నారో లెక్కలు తేలుద్దాం. రాజకీయ నాయకుల బెదిరింపులకు మేము భయపడాం. సినీ రంగాన్ని టార్గెట్ చేయడం తగదు. అలాగే సినీ పరిశ్రమలో దాసరి నారాయణరావు స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరు. ఆయనలా అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. చిరంజీవి,బాలకృష్ణ, మోహన్బాబుతో పాటు అగ్రనటులందరూ తమ పరిధి మేరకు ఇండస్ట్రీకి ఏదో ఒక రకంగా తోడ్పాటునందిస్తున్నారు. వారిపై నిందలు వేయడం తగదు’ అని అన్నారు.