దిగ్గజ నటి స్వర్గీయ జమున బయోపిక్ రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలనాటి మేటి నటిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న ఈ నాయిక జీవిత కథను తెరకెక్కించేందుకు తమిళ చిత్ర పరిశ్రమ అడుగుముందుకేసింది. జమున పాత్రలో తమన్నాను నాయికగా సంప్రదించారని సమాచారం. ఈ చిత్రంలో నటించేందుకు తమన్నా కూడా ఆసక్తిగా ఉందట. గతంలో కీర్తి సురేష్ సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో నటించి పేరు తెచ్చుకుంది. దక్షిణాది భాషల్లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. మహానటి సావిత్రితో పోల్చుకోదగిన సమకాలీకురాలైన జమున జీవిత కథా చిత్రానికి కూడా మంచి ఆదరణ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
జమున నట జీవితంలో జరిగిన పరిణామాలు, ఆ ఇబ్బందులను ఆమె ధైర్యంగా ఎదుర్కొన్న తీరు, స్టార్ హీరోయిన్గా ఎదిగిన క్రమం అంతా ఓ సినిమాకు కావాల్సిన నాటకీయతను అందిస్తాయని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇక తమన్నా కెరీర్ చూస్తే తెలుగులో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’, కోలీవుడ్లో రజనీతో ‘జైలర్’ చిత్రాల్లో నటిస్తున్నది. ఇవి కాక ఆమెకు హిందీలో ‘భోలే చుడియాన్’, మలయాళంలో ‘బాంద్రా’
సినిమాలున్నాయి.