‘స్వాతిముత్యం’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు లక్ష్మణ్ కె కృష్ణ. బెల్లంకొండ గణేష్ కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ పాత్రికేయులతో ముచ్చటించారు.
నా స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. సినిమాల మీద వ్యామోహంతో ఇంజనీరింగ్ విద్యని మధ్యలో వదిలేసి హైదరాబాద్ వచ్చాను. చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశా. ‘కృష్ణమూర్తి గారింట్లో’ ‘సదా మీ ప్రేమలో’ వంటి ఇండిపెండెంట్ ఫిల్మ్స్కు మంచి పేరొచ్చింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హీరో బెల్లంకొండ గణేష్తో పరిచయం ఏర్పడింది. ‘స్వాతిముత్యం’ ఫ్యామిలీ ఎంటర్టైనర్. పిఠాపురం నేపథ్యంలో కథ నడుస్తుంది. సినిమాలో హీరో పేరు బాల మురళీకృష్ణ. జూనియర్ ఇంజనీర్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. అతని పెళ్లి చుట్టూ అల్లుకున్న కథ ఇది. టౌన్ నేపథ్యంలో సహజత్వం, అమాయకమైన పాత్రల చుట్టూ కథ నడుస్తుంది. అందుకే ‘స్వాతిముత్యం’ అనే టైటిల్ పెట్టాం.
విలన్స్ ఎవరూ ఉండరు
ఈ కథ విన్న తర్వాత నిర్మాత రాధాకృష్ణగారు ‘ఇందులో చాలా వరకు అమాయకమైన పాత్రలున్నాయి. స్వా తిముత్యం అనే టైటిల్ బాగుంటుంది’ అని సలహా ఇచ్చారు. కథానుగుణంగా సరైన టైటిల్ అనిపించడంతో అదే ఫైనల్ చేశాం. ఈ సినిమా ఫస్ట్కాపీ చూశాం. అనుకున్న విధంగా అవుట్పుట్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల య్యాం. త్రివిక్రమ్గారు ఈ సినిమా చూడలేదు కానీ..స్క్రిప్ట్ మొత్తం చదివి చాలా బాగుందని మెచ్చుకున్నారు. దర్శకుల్లో మణిరత్నం, వంశీ, బాపు, జంధ్యాల నాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చారు.