Rhea Chakraborty | బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి ముంబయి హైకోర్ట్లో ఊరట లభించింది. నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ 2020 జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. అది ఆత్మహత్య కాదనీ, ముమ్మాటికీ హత్యేననీ, దీనికి కారణం రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులేనని ఆరోపిస్తూ సుశాంత్ కుటుంబసభ్యులు ముంబయిలో కేసు దాఖలు చేశారు. అంతేకాక సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి 15కోట్లు రియా, రియా కుటుంబసభ్యులు బదిలీ చేసుకున్నారని, సుశాంత్కి రియా మాదకద్రవ్యాలను కూడా ఇచ్చేవారనీ సుశాంత్ కుటుంబసభ్యులు ఆరోపించారు.
మనీలాండరింగ్, మాదకద్రవ్యాలు.. ఇలా పలు అంశాలపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ విషయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రియాను ప్రశ్నించింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్ట్ అదేశాలు జారీ చేయడంతో రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే రియా కుటుంబసభ్యులు దేశం దాటి వెళ్ల కుండా సీబీఐ ఎల్వోసీని జారీ చేసింది. దీంతో ఇటీవలే ముంబయి కోర్టును రియా ఆశ్రయించడంతో ఆమె కుటుంబసభ్యులపై సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ సర్క్యులర్(ఎల్ఓసీ)ను రద్దుచేస్తూ ముంబయి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అదేశాలు జారీ చేసింది. ఈ అర్డర్పై నాలుగు వారాలు స్టే ఇవ్వాలని, సుప్రీంకోర్ట్లో అప్పీలు చేసుకునేందుకు గడువు అవసరమన్న సీబీఐ అభ్యర్ధనను కూడా హైకోర్ట్ తోసి పుచ్చింది. ఆ విధంగా కొద్దిలో కొద్ది రియా చక్రవర్తికి ఈ కేసులో ఊరట లభించినట్టయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.