రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమా గురించి ఆశ్చర్యపరిచే విషయాలు తెలుస్తున్నాయి. శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతున్నది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాలోని ఓ పాట కోసం 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నది. 12 రోజుల పాటు చిత్రీకరించే ఈ పాట కోసం అంత భారీ ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. శంకర్ చిత్రాల్లో భారీతనం గురించి ప్రేక్షకులకు తెలిసిందే. సన్నివేశాలే కాదు పాటల చిత్రీకరణ కూడా ఘనంగా ఉం టుంది.
ఖరీదైన సెట్స్, అరుదైన లొకేషన్స్, గ్రాఫిక్స్తో ఈ దర్శకుడు గతంలో పాటల చిత్రీకరణ జరిపారు. మరి రామ్ చరణ్ చిత్రంలో ఆయన ఎలాంటి తరహా పాట రూపొందిస్తున్నారు, ఆ పాటకు 15 కోట్ల రూపాయల ఖర్చు ఎలా అయ్యిందనేది మున్ముందు తెలియనుంది. పొలిటికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. ఇందులో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.