‘జానపద చిత్రాల దర్శకుడిగా, విజయవంతమైన నిర్మాతగా విఠలాచార్య గొప్ప పేరుగడించారు. ఆయన దర్శకత్వంలో నేను ‘ఇద్దరు మొనగాళ్లు’ అనే ఒకే ఒక్క సినిమా చేశా. నేను నటించిన తొలి మల్టీస్టారర్ సినిమా అదే. విఠలాచార్య సినీ ప్రయాణంపై పుస్తకం రావడం సంతోషంగా ఉంది’ అని అన్నారు సీనియర్ హీరో సూపర్స్టార్ కృష్ణ. విఠలాచార్య సమగ్ర సినీ జీవితాన్ని ఆవిష్కరిస్తూ సినీ పాత్రికేయుడు పులగం చిన్నారాయణ రాసిన ‘జై విఠలాచార్య’ పుస్తకాన్ని కృష్ణ విడుదలచేశారు. ‘మూవీ వ్యాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. కృష్ణ మాట్లాడుతూ ‘విఠలాచార్య వేగంగా, అనుకున్న బడ్జెట్లోనే సినిమాలు తీసేవారు. ఏ సినిమాకు అయినా ఒకే సెట్ వేసేవారు. ఆ రోజుల్లో వాహినీ స్టూడియోస్లో నా సినిమా షూటింగ్లు ఎక్కువగా జరిగేవి. మా సెట్కు వచ్చి నాతో విఠలాచార్య సరదాగా కబుర్లుచెప్పేవారు’ అని అన్నారు. పులగం చిన్నారాయణ మాట్లాడుతూ ‘విఠలాచార్య సినీ ప్రయాణానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రాసిన పుస్తకం ఇది. తక్కువ బడ్జెట్, లొకేషన్స్లో వేగంగా, పొదుపుగా ఎలా సినిమా తీయవచ్చో ఆచరించి చూపించారు. సినిమా నిర్మాణంలో ఆయనో పెదబాలశిక్ష లాంటివారు’ అని పేర్కొన్నారు. ‘పులగం చిన్నారాయణ రాసిన ఎనిమిది పుస్తకాల్ని మేము ప్రచురించాం. ఇది తొమ్మిదో పుస్తకం’ అని షేక్ జిలాన్ బాషా పేర్కొన్నారు.