ముంబై : ఇటీవల కాలంలో నగదు లావాదేవీ ఎక్కువగా ఆన్లైన్ విధానంలో సాగుతున్నాయి. దీంతో ఇదే అదునుగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని మాయమాటలు చెప్పి పాన్కార్డు వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీలు సేకరించి అందినకాడికి దోచుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలను సైతం బురిడీ కొట్టించిన సంఘటనలున్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్ సైతం ఆన్లైన్ నగదు లావాదేవీల విషయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆన్లైన్ నగదు లోన్ ఫ్రాడ్ బారిన పడ్డట్లు ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది.
గుర్తుతెలియని వ్యక్తులు తన పాన్ కార్డును ఉపయోగించి ధని యాప్ నుంచి ఎవరో రూ.2వేల రుణం తీసుకున్నారని సన్నీ లియోన్ తెలిపింది. లోన్ తిరిగి చెల్లించకుండా జాప్యం చేయడంతో తన సిబిల్ స్కోర్ దెబ్బతిందని పేర్కొంది. దీంతో వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించింది. దీంతో అధికారులు వెంటనే సన్నీ లియోన్ పేరుపై లోన్ తీసుకున్న వ్యక్తులను గుర్తించి, సమస్యను పరిష్కరించారని తెలిపింది. సదరు బ్యాంకు అధికారులకు, సిబిల్ స్కోర్ సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా అందరు అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే మోసగాళ్ల బారినపడే అవకాశం ఉందని పేర్కొంది.