ముంబై : తనతో పాటు తన భర్త డేనియల్ వెబర్, తన ఉద్యోగిపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సన్నీలియోన్ సహా ఆమె భర్త, ఉద్యోగిపై కేరళలోని ఎర్నాకుళానికి చెందిన ఈవెంట్ మేనేజర్ శియాస్ కుంజుమహ్మద్ కేసు వేశారు.
నాలుగేండ్ల కిందట ఓ షోలో పాల్గొనేందుకు సన్నీ లియోన్ లక్షల రూపాయలు ఫీజు తీసుకుని ఈవెంట్కు హాజరు కాలేదని ఆరోపిస్తూ శియాస్ చేసిన ఫిర్యాదు మేరకు ఆమెతో పాటు భర్త వెబర్, ఆమె వద్ద పనిచేసే ఉద్యోగిపై కేసు నమోదైంది. ఈ ఆరోపణల వ్యవహారంలో సన్నీలియోన్కు వ్యతిరేకంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక తాజాగా ఈ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంటూ తమపై అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ సన్నీలియోన్ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను, తన భర్త, తమ వద్ద పనిచేసే ఉద్యోగి అమాయకులమని. తమపై చేసిన ఆరోపణలకు నిర్ధిష్టంగా ఎలాంటి ఆధారాలు లేవని ఆమె పేర్కొన్నారు. పిటిషనర్ ఎలాంటి నష్టాలకు గురికాలేదని, కానీ తాను, తన భర్త దీర్ఘకాలంగా ఈ కేసు వల్ల కష్టనష్టాలు ఎదుర్కొన్నామని సన్నీలియోన్ హైకోర్టుకు నివేదించారు.