‘మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందిన చిత్రమిది. అమాయకురాలైన పల్లెటూరి మహిళ సమాజంపై ఎదురుతిరిగి ఎందుకు పోరాడాల్సివచ్చిందనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అని అన్నారు రిజ్వాన్. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘సుందరి’. పూర్ణ, అర్జున్ అంబటి జంటగా నటించారు. కల్యాణ్ జీ గోగణ దర్శకుడు. ఈ నెల 13న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్లో రిజ్వాన్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘పూర్ణ నటన, పాత్రచిత్రణ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. తొలుత టైటిల్ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ను అనుకున్నాం. కానీ ఈ పాత్రకు న్యాయం చేసే వారు ఎవరూ దొరకలేదు. తక్కువ సంభాషణలు, ఎక్కువ హావభావాలతో నటనను పలికించే కథానాయిక కావాలని పూర్ణను తీసుకున్నాం. అంతర్లీనంగా చక్కటి సందేశం మిళితమై ఉంటుంది. అశ్లీలత, ద్వంద్వర్థాలు సినిమాలో ఉండవు. మా సంస్థపై నిర్మించిన తదుపరి చిత్రం ‘సూపర్ మచ్చి’ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ స్టార్ హీరో సినిమాతో పాటు సప్తగిరి కథానాయకుడిగా మరో సినిమాను నిర్మిస్తున్నా’ అని తెలిపారు.