హేతల్ దవే.. ఏకైక భారతీయ మహిళా సుమో రెజ్లర్. ఈ ముంబై ఆణిముత్యం వివిధ అంతర్జాతీయ వేదికల మీద భారత్కు ప్రాతినిధ్యం వహించింది. అనేకానేక పతకాలు సొంతం చేసుకున్నది. లిమ్కా నుంచి గిన్నిస్ వరకు చాలా రికార్డులే బద్దలుకొట్టింది. పోలండ్, ఫిన్లాండ్, తైవాన్.. ప్రతి పర్యటనా ఓ విజయ యాత్రే. ఆ పరంపరతో ప్రపంచ ర్యాంకింగ్లో ఐదో స్థానంలో నిలిచింది. నూటయాభై మంది ‘భయానికే భయం పుట్టించే విశ్వ మహిళల’ జాబితాలో చోటు సాధించింది.
ఇక తన వ్యక్తిగత జీవితంలోనూ అనేక మలుపులు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. సామాజిక వివక్షను అధిగమించింది. బరిలోనే కాదు, బతుకులోనూ ఎన్నో ఆటుపోట్లు. ఓ మంచి సినిమాకు ఇంతకు మించిన మసాలా ఏం ఉంటుంది? అందుకే.. నటి శ్రియమ్ భగ్నాని ప్రధాన పాత్రలో ‘సుమో దీదీ’ పేరిట దవే జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటికే టీజర్ విడుదలైంది. జయంత్ రోహత్గీ. దర్శకత్వం వహిస్తున్నాడు. ‘కుస్తీపోటీలు పురుషుల ఆస్తిగా భావిస్తున్న రోజుల్లోనే దీదీ కుస్తీలో సత్తా చాటుకుంది. తనలో పరకాయ ప్రవేశం చేసే అదృష్టం దక్కింది నాకు’ అని సంతోషాన్ని వెలిబుచ్చింది నటి శ్రియమ్. శుభం!