హైదరాబాద్; మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ..ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం సినీ ప్రముఖులు మొక్కలు నాటారు. ప్రముఖ కవి, సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజ శ్రీనగర్ కాలనీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఎంపీ సంతోష్ కుమార్ను ఆకుపచ్చ చందమామగా అభివర్ణించారు. ఈ కార్యక్రమం మరింత విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. తాను రాసిన ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’ వచన రూప కవిత్వం పుస్తకాన్ని ఎంపీ సంతోష్కుమార్కి బహుమతిగా పంపారు. అదే విధంగా శ్రీనగర్కాలనీలో ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ‘నాతిచరామి’ యూనిట్ సభ్యులు …..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో ‘నాతిచరామి’ సినిమా యూనిట్ బృందం మొక్కలు నాటింది. ఈ సందర్భంగా చిత్ర నటుడు అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. కొవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి ప్రకృతి మీద ప్రేమ మరింత పెరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సినీ నటులు రవితేజ, రణ్విజయ్సింగ్, నటి మీనాక్షి దీక్షిత్ ముగ్గురికి అరవింద్ కృష్ణ గ్రీన్ చాలెంజ్ విసిరారు. కార్యక్రమంలో నటులు సందేశ్, జయశ్రీ రాచకొండ, డైరెక్టర్ నాగు గవర తదితరులు పాల్గొన్నారు.