తమిళంతో పాటు తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు స్టార్ హీరోలు సూర్య, కార్తి. ఈ ఇద్దరన్నదమ్ములు కలిసి నటిస్తే చూడాలన్నది అభిమానుల చిరకాల కోరిక. దీనిని సాకారం చేస్తానని మాటిచ్చారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇద్దరు బ్రదర్స్ను నాయక, ప్రతినాయక పాత్రల్లో చూపిస్తూ మలయాళం సూపర్హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ చేస్తానని లోకేష్ కనకరాజ్ ప్రకటించడం తమిళ సినీ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.
ఇటీవలే కమల్హాసన్తో ‘విక్రమ్’ సినిమా తీసి దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించారు లోకేష్ కనకరాజ్. ప్రస్తుతం ఆయన ‘ఖైదీ-2’తో పాటు దళపతి విజయ్తో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఓ తమిళ పత్రికతో ముచ్చటించిన ఆయన ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ విషయాన్ని బయటపెట్టాడు. ‘ఈ మధ్యే అయ్యప్పనుమ్ కోషియం’ సినిమా చూశా. బాగా నచ్చింది. బీజుమీనన్ పాత్రలో సూర్య, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో కార్తిని చూడాలనుకుంటున్నా. తప్పకుండా ఈ వారిద్దరితో సినిమా చేస్తా’ అని లోకేష్ కనకరాజ్ తెలిపారు.