సమావేశ షెడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా
ఇంద్రవెల్లి, జూన్ 21 : ఐటీడీఏ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చేయవద్దని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులతో పాటు సంబంధిత కాంట్రాక్టర్లను పీవో భవేశ్ మిశ్రా హెచ్చరించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో మండలంలోని పిట్టబొంగురం, ఇంద్రవెల్లి పీహెచ్సీ ఆవరణలో చేపడుతున్న సమావేశ షెడ్డు నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. మండలంలోని పిట్టబోంగురం, ఇంద్రవెల్లి పీహెచ్సీ అవరణలో ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న సమావేశం షెడ్ల నిర్మాణ పనులను సోమవారం ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా పరిశీలించారు. పనులు మూడు నెలలైనా పూర్తికాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాప్యంపై సంబంధిత కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాకపోతే చెప్పండి.., వేరే వారికి అప్పగిస్తామంటూ మండిపడ్డారు. త్వరగా చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉట్నూర్ డివిజన్ పరిధిలోని గాదిగూడ, నార్నూర్, పట్టబొంగురం, ఇంద్రవెల్లి ప్రభుత్వ దవాఖానల్లో సమావేశ షెడ్లను నిర్మిస్తున్నామన్నారు. మీటింగ్ హాల్, స్టోర్ రూంలను వేర్వేరుగా నిర్మించి, కావాల్సిన ఫర్నిచర్తో పాటు తాగునీటి, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడిమేత మనోహర్, వైద్యుడు శ్రీకాంత్, ఐటీడీఏ ఈఈ భీంరావ్, డీఈ తానాజీ, సీహెచ్వో రాథోడ్ బాబులాల్ తదితరులు పాల్గొన్నారు.