“ప్రేమలు’ తెలుగు వెర్షన్ ప్రీమియర్లు గురువారం వేశాం. తొలుత ఒక స్క్రీన్ అనుకున్నాం. ప్రేక్షకుల తాకిడి చూసి ఒక్కో స్క్రీన్ పెంచుకుంటూ వెళ్లాం. చివరికి పది షోస్ వేశాం. ఎక్కడ చూసినా అద్భుతమైన రెస్పాన్స్’ అని దిల్ రాజు అన్నారు. నెల్సన్ కె.గఫూర్, మమిత బైజు జంటగా రూపొందిన మలయాళం బ్లాక్బస్టర్ ‘ప్రేమలు’. గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేశారు రాజమౌళీ తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ.
శుక్రవారం ఈ సినిమా విడుదలైన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్ రాజు మాట్లాడారు. ‘ ఈ సినిమాకు వస్తున్న స్పందన ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఉంది. వాతావరణం చూస్తుంటే మలయాళంలో ఎంత హిట్ అయ్యిందో, తెలుగులో అంతకు మించిన హిట్ అయ్యేలా ఉంది. కార్తికేయ ఈ సినిమాను తెలుగులో చేయాలనుకున్నప్పుడు, నేను నైజాంలో రిలీజ్ చేస్తానని చెప్పాను. ఇది మలయాళం సినిమానే అయినా 90శాతం హైదరాబాద్లోనే తీశారు. సినిమా అంతా మన లొకేషన్సే కనిపిస్తాయి. కథ, కథనం తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. తెలుగులో డైలాగులను ఆదిత్య అద్భుతంగా రాశాడు’ అన్నారు దిల్రాజు. సినిమా అంతా వినోదభరితంగా ఉంటుందని కార్తికేయ చెప్పారు.