నటుడిగా దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ చూపిస్తుంటారు అవసరాల శ్రీనివాస్. ఆయన రూపొందించిన గత చిత్రాలు ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ మంచి విజయాలు సాధించాయి. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ రూపొందించిన తాజా సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. ఈనెల 17న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు అవసరాల శ్రీనివాస్.
సహజత్వంతో కూడిన చిత్రమిది
నిజజీవితంలో నేను చూసిన కొన్ని సందర్భాలను ఆధారంగా చేసుకుని రాసుకున్న కథ ఇది. మనలో ఒకరి కథలా ఉంటుంది కాబట్టి టైటిల్ కూడా సహజంగా ఉండాలనుకున్నాను. నా గత చిత్రాలకు భిన్నమైన శైలిలో సినిమా సాగుతుంది. ఈ సినిమాలో ఏడు చాఫ్టర్లు ఉంటాయి. ఒక్కో అధ్యాయం నిడివి 20 నిమిషాలు ఉంటుంది. పదేండ్ల వ్యవధిలో ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ కాల పరిమితిలో హీరో హీరోయిన్ల జీవితంలో గడిచిన 18 నుంచి 28 ఏండ్ల కథ ఆసక్తికరంగా చూపిస్తున్నాం.
నాగశౌర్య నటన ఇష్టం
శౌర్య నటనను ఇష్టపడతాను. ముఖ్యంగా ఈ కథ నటీనటుల పర్మార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్లు ఎంత బాగా నటిస్తే సన్నివేశాలు అంత బాగా వస్తాయి. షూటింగ్లో ఇబ్బందులు ఉంటే అవి నాగశౌర్య నటన చూసి మర్చిపోయేవాడిని. నానితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనతో సినిమా చేస్తాను. ఇకపై ఎక్కువగా దర్శకత్వంపైనే దృష్టి పెడతా.