దివంగత అందాల తార శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. అసమాన అభినయం, అందచందాలతో దేశవ్యాప్తంగా అభిమానగణాన్ని సంపాదించుకున్న శ్రీదేవి జీవితంలోని ఆసక్తికరమైన అంశాల్ని పొందుపరుస్తూ ప్రముఖ రచయిత, పరిశోధకుడు ధీరజ్ కుమార్ ‘శ్రీదేవి..ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో ఈ పుస్తకాన్ని రచించారు. తాను రాసిన తొలి బయోగ్రఫీ ఇదని, త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నామని రచయిత ధీరజ్ కుమార్ పేర్కొన్నారు. శ్రీదేవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయని బోనీ కపూర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘శ్రీదేవి అంటే వెండితెరపై ఓ అద్భుతం.
భాషా భేదాలతో సంబంధం లేకుండా ఆమె అందరి అభిమానం సంపాదించుకుంది. అలాంటి గొప్ప నటి జీవిత చరిత్రను రాసినందుకు రచయిత ధీరజ్కు అభినందనలు. అతన్ని మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తాం’ అని తెలిపారు. భారతీయ చిత్రసీమలో అగ్ర తారగా వెలుగొందిన శ్రీదేవి 2018 ఫిబ్రవరిలో మరణించారు.