“దీవాన’ కేవలం లవ్స్టోరీనే కాదు. ఇందులో జీవితం తాలూకు అనేక విషయాల్ని చర్చించారు. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాను చూసి ప్రోత్సహించాలి’ అన్నారు హీరో శ్రీవిష్ణు. హర్షిత్రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ‘దీవాన’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం శ్రీవిష్ణు అతిథిగా థాంక్స్మీట్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్ను తాను చూడలేదని, అలా ఎందుకు చేశాడని దర్శకుడి మీద కోపం వచ్చిందన్నారు.
ఈ సినిమాలోని ప్రతీ పాత్రను ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటున్నారని, మొదటివారం తర్వాత కూడా 70శాతం ఆక్యుపెన్సీ ఉండటం సినిమా విజయానికి నిదర్శనమని హీరో హర్షిత్ రెడ్డి అన్నారు. పెళ్లిచూపులు, కేరాఫ్ కంచరపాలెం తరహాలో చాలా అరుదుగా వచ్చే సినిమా ఇదని, ఇప్పట్లో ఓటీటీలో రిలీజ్ చేయడం లేదని, ప్రేక్షకులు థియేటర్లో చూసి ఫీల్ అవ్వాలని నిర్మాతలు కోరారు. ఇప్పటివరకు ఏ భాషలో రాని కథ ఇదని, బిగ్స్క్రీన్లోనే చూడాల్సిన సినిమా ఇదని దర్శకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.