దేశంలో ఏ రాష్ర్టానికి వెళ్లినా.. దక్షిణాది సినిమాల గురించే ముచ్చటించుకుంటున్నారు. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఇటీవల మరింత ఊపందుకుంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం చిత్రాలు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతుండటంతో.. హోల్ ఇండియా సినిమా రెవెన్యూలో దక్షిణాది అయిదు రాష్ర్టాల వాటా 52 శాతానికి చేరిందని లెక్కలు చెబుతున్నాయి.
2022లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, కాంతార వంటి బ్లాక్బస్టర్ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వసూళ్లలో సింహభాగం దక్షిణాది చిత్రాలు కొల్లగొట్టాయి. 2022లో దేశవ్యాప్తంగా మొత్తం సినిమాల వసూళ్లు రూ.15వేల కోట్లు అయితే, ఇందులో దక్షిణాది చిత్రాల వాటా రూ.7,836 కోట్లుగా తేల్చారు. మొత్తం రాబడిలో ఇది 52 శాతం. కాగా, సినిమాల సంఖ్య విషయానికి వస్తే 2022లో 1,691 విడుదల కాగా, అందులో 54 శాతం అంటే 916 సినిమాలు దక్షిణాది రాష్ర్టాలకు చెందినవి. తాజా సంవత్సరం అంచనాలకు వస్తే.. తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలు గతేడాది కన్నా బలంగా వసూళ్లు సాధిస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఏడాది ద్వితీయార్ధంలో భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో అదేస్థాయిలో కలెక్షన్లు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. కన్నడ సినిమాల విషయానికి వస్తే గతేడాది కేజీఎఫ్ 2, కాంతార బాక్సాఫీస్ను దున్నేయడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ ఏడాదికి వచ్చేసరికి కన్నడ చిత్రసీమ కాసులు కొల్లగొట్టడంలో విఫలమవుతుందని జోస్యం చెబుతున్నారు. అయితే అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో వేచి చూడాలి!