సోనూసూద్….నటుడిగా అతను సాధించిన ఘనత కంటే, లాక్డౌన్ కాలంలో చేసిన సేవే ఎక్కువ పేరు తీసుకొచ్చింది. యునెటైడ్ నేషన్స్ ప్రత్యేక పురస్కారాన్నీ అందించింది. నటుడిగా సోనూ ఎప్పుడూ బిజీనే. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తుంటారు. ఆయన ప్రస్తుతం తెలుగులో ‘ఆచార్య’తో పాటు హిందీలో అక్షయ్కుమార్తో కలిసి ‘పృథ్వీరాజ్’ అనే చిత్రంలో నటించారు. ఎంటీవీ రియాల్టీ షో ‘రోడీస్’కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తనకింత జీవితాన్ని ఇచ్చిన తండ్రి శక్తి సాగర్ సూద్ను జయంతి సందర్భంగా గుర్తు చేసుకున్నారీ నటుడు. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
‘నాన్నా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు లేకుంటే మాకు జీవితమే లేదన్న విషయం ప్రతిక్షణం గుర్తుంచుకుంటాం. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. ప్రతి క్షణం మా వెంటే ఉంటూ నడిపిస్తున్నావని తెలుసు. నిన్ను మళ్లీ చూసేవరకు మాతోనే ఉండు’ అంటూ తన పోస్టులో పేర్కొన్నారు సోనూ సూద్. 2016లో సోనూ సూద్ తండ్రి శక్తి సాగర్ కన్నుమూశారు. ఆ తర్వాత ఆయన పేరు మీద శక్తి సాగర్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు సోనూ సూద్.