ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్లో అగ్రకథానాయికగా నిలిచిన నటి సొనాలీ బింద్రే. ‘మురారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బాంబే సొగసరి ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులలో మాత్రం సుస్థిర స్థానం సంపాదించుకుంది. 2018లో కాన్సర్ బారిన పడి మనోధైర్యంతో చికిత్స తీసుకుని ఆ మహమ్మారి నుంచి కోలుకుంది. ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
తాజగా ఈమె ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే వెబ్ సిరీస్లో నటించింది. ప్రముఖ బ్రిటీష్ టెలివిజన్ సిరీస్ ‘ప్రెస్’ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్సిరీస్ జూన్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను జరుపుతుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి సోనాలి బింద్రే టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వబోతుందని, ఎన్టీఆర్-కొరటాల శివ ప్రాజెక్ట్లో కీలకపాత్రలో నటించనుందంటూ చర్చలు జరిగాయి. తాజాగా ఓ ఇంటర్వూలో మీరు ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నారా అని అడుగగా.. దానికి సోనాలి ఆశ్చర్యంతో ఎవరు? నేనా.. లేదు. నాకు ఈ విషయమే తెలీదు. నాకు మీరు మాట్లాడే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఇది కచ్చితంగా రూమర్ అంతే అంటూ బదులిచ్చింది.