Adipurush | ‘ఆది పురుష్’ చిత్రం చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా ప్రభాస్ టైటిల్ పాత్రలో ఓంరౌత్ రూపొందించిన ఈ చిత్రం హిందూ సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని కించపరిచేలా ఉందంటూ పలు హిందూ సంఘాలతో పాటు సోషల్మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చవకబారు సంభాషణలు, అభూత కల్పనలతో రామాయణ ఇతిహాస ప్రామాణికతను దెబ్బతీసేలా పాత్రల చిత్రణ ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ హిందూ సేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఛత్తీస్ఘడ్లోని కొన్ని జిల్లాల్లో ఈ సినిమాను నిషేధించాలని ప్రజా సంఘాలు నిరసన ర్యాలీలు చేపట్టాయి.
‘ఆదిపురుష్’ చిత్రానికి తొలిరోజు భారీ ఓపెనింగ్స్ లభించినప్పటికీ అదే స్థాయిలో విమర్శలొచ్చాయి. హద్దుమీరిన సృజనాత్మక స్వేచ్ఛతో రామాయణ గాథను వక్రీకరించారని, సినిమాలో ఆధ్యాత్మిక అంశాలు పూర్తిగా కొరవడ్డాయని, గ్రాఫిక్స్తో కనికట్టు చేసే ప్రయత్నం జరిగిందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్ మొదలుకొని స్క్రిప్ట్, స్క్రీన్ప్లే, సంభాషణలు..ఇలా ప్రతీ అంశంలో సినిమా లోపభూయిష్టంగా ఉందని సోషల్మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. గ్రాఫిక్స్ మాయాజాలాన్ని నమ్ముకొని రామాయణం తాలూకు ఆత్మను విస్మరించారని పలువురు ఆధ్యాత్మికవేత్తలు విమర్శి ంచారు. ఇక ఈ సినిమాలో హనుమాన్ పాత్రధారి ఉపయోగించిన సంభాషణలపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. లంకా దహనం సన్నివేశంలో ‘జలేగీ భీ తేరే బాప్కీ’ అనే డైలాగ్ను హనుమాన్ నోట పలికించడం ఆయన పాత్ర ఔన్నత్యాన్ని దెబ్బతీయడమేనని సోషల్మీడియాలో తీవ్ర విమర్శలొచ్చాయి.
ఛత్తీస్ఘడ్ జిల్లాలోని మనేంద్రఘడ్, చిర్మిరి, భరత్పూరి జిల్లాల్లో ‘కోరే సాహిత్య అవమ్ కళా మంచ్’ ఆధ్వరంలో చిత్ర ప్రదర్శన జరుగుతున్న థియేటర్ల వద్ద నిరసన ప్రదర్శలను చేపట్టారు. ‘రాముడు మర్యాద పురుషోత్తముడు. అసలు ఈ సినిమాకు ‘ఆదిపురుష్’ అని పేరు పెట్టడమే పెద్ద తప్పు. రామాయణగాథ గురించి నేటి తరాన్ని తప్పుదోవ పట్టించేలా, సనాతన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈ సినిమాను రూపొందించారు’ అని కోరే సాహిత్య అవమ్ కళా మంచ్ సభ్యురాలు అనామిక చక్రవర్తి పేర్కొంది.
‘ఆదిపురుష్’ హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ హిందూ సేన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చిత్ర ప్రదర్శనను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ సినిమాలో భారతీయ పురాణ పాత్రల్ని అనుచిత రీతిలో చూపించారని హిందూ సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. నగర మేయర్ బాలెన్ షా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీత జన్మస్థానాన్ని సినిమాలో తప్పుగా ప్రస్తావించారని నేపాల్ ఫిల్మ్ యూనియన్ పేర్కొంది.
‘ఆదిపురుష్’ చిత్రంలోని కొన్ని సంభాషణలపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో చిత్రబృందం నష్టనివారణ చర్యలకు సిద్ధమైంది. అభ్యంతరకరమైన సంభాషణల్ని మార్చుతున్నట్లు డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘అందరి భావోద్వేగాలను గౌరవించడం మా బాధ్యత. సనాతన ధర్మం గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాం. అయితే కొందరు నాపై విమర్శలు చేస్తున్నారు. తమ ఊహలకు భిన్నంగా సంభాషణలు ఉన్నాయని అంటున్నారు. అందుకే చిత్రబృందమంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. మీ మనోభావాలను గౌరవిస్తూ సంభాషణల్లో మార్పులు చేయబోతున్నాం. ఓ వారం రోజుల్లో కొత్తగా మార్చిన సంభాషణలతో సినిమా చూడొచ్చు’ అని రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా పేర్కొన్నారు.