సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న జంటగా నటించిన ‘మిషన్ మజ్ను’ చిత్రాన్ని గూఢచారి థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించారు. భారత్-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇండియాతో జరిగిన మూడు యుద్ధాల్లో ఓడిపోవడంతో ప్రతీకారం తీర్చుకునే అదును కోసం పాకిస్థాన్ ఎదురుచూస్తూ ఉంటుంది. ఇదే సమయంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అణ్వాయుధాన్ని విజయవంతంగా పరీక్షిస్తుంది. ఇండియాకు దీటుగా తానూ అణుబాంబు తయారు చేసుకోవాలని పాకిస్థాన్ ఆరాటం. ఆ బాధ్యతను ఖాన్ అనే సైంటిస్ట్కు అప్పగిస్తుంది.
పాకిస్థాన్ అణుబాంబు తయారీ రహస్యాల్ని తెలుసుకోవడానికి భారత్ ‘మిషన్ మజ్ను’ పేరుతో ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపడుతుంది. అందుకు స్పై ఏజెంట్గా తారిఖ్ను (సిద్ధార్థ్ మల్హోత్రా) నియమిస్తుంది. పాకిస్థాన్ అణు స్థావరాన్ని అతను ఎలా కనిపెట్టాడు, ఈ క్రమంలో అంధురాలైన నస్రీన్ను (రష్మిక మందన్న) వివాహం చేసుకున్న తారిఖ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే మిగతా చిత్ర కథ. దేశభక్తి ప్రధానంగా సాగే స్పై థ్రిల్లర్ ఇది. యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఇండియన్ ఏజెంట్ అత్యంత రహస్యంగా పాకిస్థాన్లో ఎలా ఆపరేషన్ నిర్వహించాడనే పాయింట్లోనే థ్రిల్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే కొంత బలహీనమైన స్క్రీన్ప్లే వల్ల కథాగమనంలో ఉత్కంఠ తగ్గిపోయిందనే భావనా ఉంది.
మిషన్ మజ్ను నెట్ఫ్లిక్స్ ఓటీటీ (జనవరి 20)
తారాగణం: సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న
దర్శకత్వం: శంతన్ బాగ్చి