Kiara Advani – Sidharth Malhotra | బాలీవుడ్ నటులు కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్ర ప్రేమలో ఉన్నారని, త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, ఫిబ్రవరి 6వ తేదీన వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో వివాహానికి సంబంధించిన హల్దీ, సంగీత్.. ఇతర కార్యక్రమాలు ముంబయిలో జరుగుతాయని, అలాగే వీరి వివాహం మాత్రం రాజస్థాన్ జైసల్మీర్ ప్యాలెస్లో పంజాబీ సాంప్రదాయంలో జరగనున్నట్టు బీటౌన్ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి.
ఇప్పటికే పెళ్లి పనుల్లో ఈ జంట నిమగ్నమైందంటూ పలు వెబ్సైట్లు రాసుకొచ్చాయి. వీరి పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు, అత్యంత సన్నిహితులు, పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. అతిథుల కోసం కియారా-సిద్ధార్థ్ రాజస్థాన్ జైసల్మీర్లో ఓ ఫైవ్స్టార్ హోటల్ బుక్ చేసినట్లు సమాచారం. అథితుల కోసం ప్రత్యేక వంటకాలు కూడా తయారు చేయిస్తున్నారట. రాజస్థానీ సంప్రదాయ వంటకాలను అథితుల కోసం అందించనున్నట్లు సమాచారం. పెళ్లి అనంతరం ఢిల్లీ, ముంబయిలో రెండు చోట్లా వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా, వీరిద్దరూ ‘షేర్షా’ సినిమాలో తొలిసారి స్క్రీన్ పంచుకున్నారు. 2021 ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కియారా.. రామ్చరణ్, శంకర్ కలయికలో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.