‘డీజే టిల్లు రిలీజ్ సమయంలో సినిమాపై అంతగా అంచనాలు లేవు. అందుకే టీమ్ అంతా ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేశాం. కానీ ‘టిల్లు స్వేర్’ పై మాత్రం ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. దాంతో మాపై బాధ్యత పెరిగింది. అందరం కలిసి గొప్ప చిత్రాన్ని అందించేందుకు ప్రయత్నించాం. తప్పకుండా ఈ సినిమా మీ అంచనాలను అందుకుంటుంది’ అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన కథానాయకుడిగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘టిల్లు స్వేర్’ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది.
అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాలోని ‘ఓ మై లిల్లీ’ అనే పాటను సోమవారం విడుదల చేశారు. అచ్చు రాజమణి స్వర పరచిన ఈ పాటను శ్రీరామ్చంద్ర ఆలపించారు. సిద్ధు, రవి ఆంథోని రచించారు. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘వేసవి సీజన్లో తొలి చిత్రం కాబట్టి మాకు కలిసొస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో యువతతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకుల్ని అలరించే అన్ని అంశాలుంటాయి. ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది’ అన్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం తాను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నానని కథానాయిక అనుపమ పరమేశ్వరన్ చెప్పింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి.