Sid-Kiara | బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అడ్వాణీ ఈ నెల 7న వివాహబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం సిద్ధార్థ్ కొత్త పెళ్లి కూతురితో కలిసి గురువారం తొలిసారిగా ఢిల్లీలోని తన నివాసంలో అడుగు పెట్టాడు. ఈ నేపథ్యంలో అదేరోజు రాత్రి ఢిల్లీలోని లీలా ప్యాలెస్లో కుటుంబ సభ్యులు గ్రాండ్గా రిసెప్షన్ జరిపించారు. తాజాగా ఈ జంట ముంబైలో సినీ తారల కోసం గ్రాండ్గా మరో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ముంబైలోని ఓ హోటల్లో ఈనెల 12వ తేదీన సాయంత్రం 8:30 గంటలకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిసెప్షన్ ఏర్పాట్ల కోసం ఈ జంట శనివారం ఢిల్లీ నుంచి ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్కు బాలీవుడ్ సెలబ్రిటీలు, పలువురు పారిశ్రామివేత్తలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఇన్విటేషన్ కార్డు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ రిసెప్షన్కు కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మనీశ్ మల్హోత్ర, షారుక్ ఖాన్, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, జుహీ చావ్లా, అనిల్ కపూర్, అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితర సెలబ్రిటీలు సహా కుటుంబ సభ్యులు, పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నట్లు సమాచారం.
షేర్షా సినిమాతో ఆన్స్క్రీన్ హిట్ పెయిర్గా నిలిచిన సిద్ధార్థ్, కియారా కొంతకాలానికి ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హిందీ చిత్రసీమలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న కియారా అద్వాణీ తెలుగులో ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు చేరువైంది.