“శ్యామ్సింగరాయ్’ ఓ ఎపిక్ లవ్స్టోరీ. కథలో హీరో అమ్మ తెలుగు మహిళ, నాన్న బెంగాలీ..ఈ సబ్జెక్ట్ విన్నప్పుడే కొత్తదనం కనిపించింది. అనుకున్నదానికంటే సినిమా చాలా బాగా వచ్చింది’ అని అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. డిసెంబర్ 24న విడుదలకానుంది. గురువారం టీజర్ను ఆవిష్కరించారు. నాని మాట్లాడుతూ ‘క్రిస్మస్ నాకు చాలా స్పెషల్. ఆ సీజన్లో ‘ఎంసీఏ’తో పెద్ద హిట్ కొట్టాను. ఆ సెంటిమెంట్ పునరావృతం అవుతుందనే పూర్తి నమ్మకం ఉంది. సినిమా కథ ఎక్కువగా తెలిసిపోకూడదనే టీజర్ను అలా కట్ చేశాం. ఇప్పటి నుంచి ప్రతి సినిమాలో ఇదివరకు చూడని నానిని చూస్తారు. టీజర్ కంటే సినిమా వందరెట్లు బాగుంటుంది. ఈ క్రిస్మస్ మనదే’ అని చెప్పారు. ‘నేను నాని అభిమానిని. థియేటర్లో సినిమా చూడాలని ఆతృతగా ఎదురుచూస్తున్నా. అందరి అంచనాల్ని అందుకునేలా ఈ సినిమా ఉంటుంది’ అని దర్శకుడు తెలిపారు. కథా రచయిత సత్యదేవ్ జంగా మాట్లాడుతూ ‘విప్లవాత్మక ప్రేమకథ ఇది. విప్లవం మనసుది..ప్రేమ హృదయానిదని తెలియజెపుతుంది. ఇప్పటివరకు చూడని కొత్త కథగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు. ‘అడిగే అండ లేదు..కలబడే కండ లేదని రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే..కాగితం కడుపు చీల్చుకుపుట్టి రాయడమే కాదు..కాలరాయడం కూడా తెలుసని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే శ్యామ్సింగరాయ్’ అనే శక్తివంతమైన సంభాషణలతో టీజర్ ఆకట్టుకునేలా సాగింది.