‘సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్, టీజర్ చెబుతున్నాయి. నచ్చిన జానర్ని ఎంచుకొని జనాలు సినిమాలు చూస్తున్నారు. ఇక్కడ ఎవరి అభిరుచి వారిది. మాస్ సినిమాలు ఎక్కువ మందికి ఇష్టం. కాబట్టి ఆ తరహా సినిమాలు ఆడుతున్నాయి. అంతేతప్ప సినిమాలు జనాల మైండ్సెట్ని మార్చడంలేదు. మాస్ సినిమాలు చూడటం హింసను ప్రేరేపించడం కాదు. మాస్ సినిమాలు హింసను ప్రేరేపించవు’ అని శ్రుతిహాసన్ అంటున్నది. ఆమె నటించిన ‘సలార్’ సినిమా వసూళ్లలో దూసుకుపోతున్నది.
ఈ నేపథ్యంలో సినిమాపై వస్తున్న నెగెటివ్ కామెంట్లకు ఆమె సమాధానమిచ్చింది. ‘ఏది చూడాలో.. ఏది వినాలో జనాలకు తెలుసు. ఎవరికి నచ్చినవి వాళ్లు చూస్తారు. ‘సలార్’ అందరికీ నచ్చుతుంది. అందుకే చూస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ బయటకొచ్చి ప్రభాస్లా ఫైట్స్ చేయరు కదా. ఆ మాటకొస్తే మన పురాణాల్లోనే హింస ఉంది. అవన్నీ హింసను ప్రేరేపిస్తున్నాయని అనగలమా?’ అంటూ ప్రశ్నించింది శ్రుతిహాసన్. ఈ ఏడాది ఆమె నటించిన వాల్తేరువీరయ్య, వీరసింహారెడ్డి, సలార్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. ఈ ఏడాది మూడు హిట్స్ అందుకున్న ఏకైక హీరోయిన్ శ్రుతిహాసన్ కావడం విశేషం.