సినీ రంగంలో పారితోషికాల ప్రస్తావన మొత్తం అగ్ర హీరోల చుట్టే తిరుగుతుంది. వారితో పోల్చితే కథానాయికలు అందుకునే పారితోషికం చాలా తక్కువ. ఈ విషయం గురించి పరిశ్రమలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నది. గ్లోబల్స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవల విడుదలైన తన తాజా వెబ్సిరీస్ ‘సిటాడెల్’ కోసం హాలీవుడ్ హీరోతో సమానమైన రెమ్యునరేషన్ స్వీకరించి వార్తల్లోకెక్కింది.
తాజాగా ఈ అంశంపై శృతిహాసన్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘పారితోషికాల్లో ఎలాంటి వివక్ష ఉండకూడదు. నాయికలకు వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలి. హీరోలతో సమానమైన పారితోషికం పొందినప్పుడు పరిశ్రమలో మంచి మార్పులొస్తాయి. ప్రియాంక చోప్రా హాలీవుడ్లో ఆ ఘనత సాధించడం ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా అలాంటి రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తున్నది.