కమల్హాసన్ ముద్దుల తనయ శృతిహాసన్ చెన్నైలో కొత్త ఇంటిలోకి అడుగుపెట్టింది. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోలను తన సోషల్మీడియా ఖాతాల ద్వారా పంచుకుంది. దాదాపు 40కోట్ల వ్యయంతో తన అభిరుచికి తగినట్లు శృతిహాసన్ ఇంటిని డిజైన్ చేసుకుందట. సోమవారం జరిగిన గృహ ప్రవేశ వేడుకలో ఆమె సోదరి అక్షరహాసన్తో పాటు కొద్దిమంది స్నేహితులు పాల్గొన్నారు. కెరీర్ ఆరంభం నుంచి దాదాపు పదిహేనేళ్లుగా ముంబయిలో నివాసం ఉంటున్నది శృతిహాసన్.
అయితే గతకొంతకాలంగా బాలీవుడ్లో ఈ భామకు అవకాశాలు తగ్గాయి. వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంలో తిరిగి చెన్నైకి మకాం మార్చిందని అంటున్నారు. ఇక నుంచి దక్షిణాది సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయం కూడా ఈ భామ చెన్నైకి షిఫ్ట్ కావడానికి ఓ కారణమని చెబుతున్నారు. ఇటీవలే ‘పెద్ది’ సినిమాలో ఐటెం సాంగ్లో మెరిసిన ఈ సొగసరి ప్రస్తుతం దుల్కర్ సల్మాన్తో కలిసి ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో నటిస్తున్నది.