Shri Krishna Avtar in Mahoba | ‘అభయ్ చరణ్ ఫౌండేషన్’, ‘శ్రీజీ ఎంటర్టైన్మెంట్’ సంయుక్తంగా ఒక చారిత్రక మహాకావ్యాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్ను తాజాగా ప్రకటించారు. “శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా” పేరుతో అనిల్ వ్యాస్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుండగా.. ముకుంద్ పాండే కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు.
ISKCON – ఢిల్లీకి చెందిన సీనియర్ ప్రీచర్ ‘జితామిత్ర ప్రభు శ్రీ’ ఆశీస్సులతో ఈ నవ్య కావ్యం రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇది 11-12వ శతాబ్దాల నాటి ‘మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని, అలాగే భగవాన్ శ్రీ కృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపించబోతుందని పేర్కొంది. చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీ కృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించబోయే సినిమా ఇది అని తెలిపింది.
‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోందని పేర్కొంది. ప్రపంచస్థాయి టెక్నీషియన్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మికతను కలగలుపుతుందని ధీమా వ్యక్తం చేసింది. ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక బృందం, ఇతర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది.