Shreya Ghoshal | గాయనిగా శ్రేయాఘోషల్ కెరీర్ నిజంగా విభిన్నం. బాలీవుడ్ విఖ్యాత గాయనీమణులు లతా మంగేష్కర్, అనురాధా పడ్వాల్, ఆశా భోంస్లే ఇతర భాషల్లో పాటలు పాడినా.. అరుదుగా మాత్రమే పాడేవారు. కానీ శ్రేయాఘోషల్ అలా కాదు. కెరీర్ మొదలుపెట్టిన నాటి నుంచి దేశంలోని అన్ని భాషల్నీ చుట్టేస్తూ జాతీయ గాయనిగా హవా సాగిస్తున్నారు. ప్రస్తుతమైతే శ్రేయా ఘోషల్ని ఓ భాషకు కట్టేయలేం. అన్ని భాషలూ ఆమెవే. రీసెంట్గా ‘తండేల్’లో ఆమె పాడిన ‘హైలెస్సో.. హైలస్సా..’ పాట తెలుగు రాష్ర్టాల్లో మోగిపోతున్నది.
త్వరలో ఆమె తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్లలో మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా చెన్నైలో ఆమె విలేకరులతో ముచ్చటించింది. సంగీతమంటే తనకెంతో ఇష్టమని, భాషలకు అతీతమైన అభిమానం తన పాటలకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా శ్రేయాఘోషల్ అన్నారు. మిగతా భాషలతో పోలిస్తే తమిళ, మలయాళ భాషల్లో పాటలు పాడటం కాస్త కష్టంగా ఉంటుందని, అందుకే ఆ భాషల్లో పాడటానికి కాస్త సమయం ఎక్కువ తీసుకుంటానని శ్రేయా తెలిపారు. ఈ ప్రెస్మీట్ అనంతరం ‘మున్బే వా ఎన్ అన్బే వా..’ అంటూ తమిళ గీతాన్ని ఆలపించి అభిమానుల్ని అలరించారు శ్రేయా ఘోషల్.