వేతనాలు పెంచాలని కోరుతూ తెలుగు సినీ కార్మికులు సమ్మె బాట పట్టారు. నేటి నుంచి షూటింగ్లకు హాజరు కాబోమని వారు ప్రకటించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి 24 విభాగాల కార్మికుల వేతనాలను పెంచాలి. అయితే గత నాలుగున్నరేళ్లుగా నిర్మాతల మండలి ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో నేటి నుంచి షూటింగ్లను బహిష్కరించి, ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సినీ కార్మికులు తెలిపారు. 24 విభాగాలకు చెందిన 72 మంది నాయకులు ఈ ప్రకటన చేశారు.
దీనిపై తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ…‘కార్మికులకు వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ తరపున నిర్మాతల మండలిని చాలాసార్లు కోరాం. తమకు పెంచాల్సిన వేతనాలు ఏడాదిన్నర ఆలస్యమవుతున్నా సినీ కార్మికులు ఓపిక పట్టారు. ఇప్పుడు వారు సహనం కోల్పోయారు. మా మాట కూడా వినడం లేదు. సినీ కార్మికుల సమ్మె నిర్ణయం న్యాయమైనది. సమ్మె కోరుకుంటున్నారా లేక సజావుగా షూటింగ్స్ జరగాలా అనే విషయంలో నిర్మాతల మండలిదే తుది నిర్ణయం’ అన్నారు. మరోవైపు కరోనా ప్రభావం ఇండస్ట్రీ ఇప్పుడే కోలుకుంటున్నదని, కార్మికులు ఓపిక పట్టాలి నిర్మాతలు కోరుతున్నారు.