Sekhar Kammula | ‘ఈ మధ్యే ‘హ్యాపీడేస్’ చూశాను. ఇప్పటికీ ఫ్రెష్గా అనిపించింది. ఈ సినిమాకు అన్నీ కుదిరాయి. రీరిలీజ్ చేస్తే ప్రజెంట్ యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. టైసన్ పాత్ర చాలా మేజిక్గా ఉంటుంది’ అన్నారు శేఖర్ కమ్ముల. 17ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘హ్యాపీడేస్’. 2017లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమేకాక, అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించింది. శుక్రవారం ఈ సినిమా రీరిలీజ్ కానుండటం, దర్శకుడిగా శేఖర్ కమ్ముల కూడా ఇండస్ట్రీలో 24ఏళ్లు పూర్తి చేసుకోబోతుండటం.. ఈ సందర్భాలను పురస్కరించుకొని ఆయన మీడియాతో ముచ్చటించారు.
రెండు దశాబ్దాల పైచిలుకుగా సాగిన తన సినీ ప్రయాణాన్ని చూస్తే గర్వంగా అనిపిస్తుందని, ఏ సినిమా చేసినా చెడు చెప్పకుండా విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి సినిమాలు చేశాననీ, డబ్బు, పేరుకోసం తాను ఈ రంగంలోకి రాలేదని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. కథ విషయంలో ఆలోచన రావడానికి, కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుందనీ, వేగంగా సినిమాలు తీయడం కంటే గుర్తుండిపోయే సినిమాలు తీయడం తన అభిమతమని శేఖర్ కమ్ముల చెప్పారు.
ధనుష్ సినిమా గురించి మాట్లాడుతూ ‘అది పెద్ద స్కేల్ సినిమా. పెద్ద ఐడియాతో ఉండే సినిమా. నాగార్జున, ధనుష్ ఈ కథకు యాప్ట్. ఇంతకంటే ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పకూడదు’ అన్నారు శేఖర్కమ్ముల. ‘లీడర్’ సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉందని, ఆ సినిమా చేస్తే మాత్రం తప్పకుండా రానాతోనే చేస్తానని అన్నారు. ‘నేటి రాజకీయాలు మరీ దిగజారిపోయాయి. దీనికి చెప్పే సొల్యూషన్ లాజిక్గా ఉండాలి. సమస్య చెబితే పరిష్కారం కూడా చెప్పాలి. దానికి టైం పడుతుంది’ అని తెలిపారు శేఖర్కమ్ముల.