సినిమా పేరు: శంబాల
తారాగణం: ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్, శాస్విక విజయ్, మధునందన్, హర్షవర్దన్ రవివర్మ, శివకార్తిక్
దర్శకుడు: యుగంధర్ ముని
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్
నిర్మాతలు: రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్రెడ్డి
సైంటిఫిక్, మైథలాజికల్ థ్రిల్లర్ అంటూ ఈ సినిమా పబ్లిసిటీని మొదలుపెట్టిన నాటినుంచీ ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఓ విధంగా ఆది సాయికుమార్ కెరీర్లో ఇంతటి అంచనాలు ఏర్పడ్డ సినిమా బహుశా ఇదేనేమో. ప్రచార చిత్రాలు కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమా చూడాలని ఆడియన్స్లో ఓ ఉత్సాహం నెలకొన్నది. ఎట్టకేలకు ఈ గురువారం ‘శంబాల’ థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా అందరి అంచనాలనూ నిజం చేసిందా? లేక బూమరాంగ్ అయ్యిందా? తెలుసుకునే ముందు కథలోకి వెళ్దాం.
కథ
ఇది 1980ల నాటి కథ. శంబాల అనే ఊర్లో ఓ ఉల్క పడుతుంది. ఆ ఉల్క పడిన నాటినుంచి ఆ ఊరిలో అన్నీ అపశకునాలు కనిపిస్తుంటాయి. దాంతో శాస్ర్తాలను, దేవుళ్లనీ, దెయ్యాలనీ అమితంగా నమ్మే ఆ ఊరి జనం ఆ ఉల్కని ‘బండ భూతం’ అని పిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ ఉల్కని స్టడీ చేసుందుకు సైంటిస్ట్ విక్రమ్(ఆది సాయికుమార్) ఆ ఊళ్లోకి అడుగుపెడతాడు. అతను సైన్స్ని మాత్రమే నమ్ముతాడు. ఊరిజనాల నమ్మకాలన్నీ మూఢ నమ్మకాలని అతని ఉద్దేశ్యం. ఆ ఉల్క పడిన నాటి నుంచి ఆ ఊరివాడైన రాములు(రవివర్మ) చిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఓ ఆవుకు పాలు పిండబోతే, పాలకు బదలు రక్తం కారుతుంటుంది. ఆ ఆవుని చంపితే కానీ ఈ ఊరికి పట్టిన అరిష్టం పోదని ఊరి జనాలు నిర్ణయించుకొని ఆ ఆవును చంపబోతుంటే విక్రమ్ అడ్డుకొని ఆ ఆవుని తనతోపాటు తీసుకెళ్తాడు. ఇక రాములు రోజురోజుకీ రాక్షసుడిలా మారుతుంటాడు. అడ్డొచ్చినవాళ్లందర్నీ చంపుకుంటూ పోతుంటాడు. ఓ దశలో విక్రమ్ మీదకు కూడా ఎగబడతాడు. తాడికి తెగబడతాడు. అసలు ఆ ఊళ్లో ఏం జరుగుతుంది? ఆ ఉల్క వెనుక ఉన్న కథేంటి? ఆ ఊళ్లో అలాంటి భయానకమైన సంఘటనలు జరగడానికి కారణమెవరు? సైన్స్ని మాత్రమే నమ్మే విక్రమ్ దేవుడ్ని మొక్కాడా? లేదా? ఈ ప్రశ్నలన్నిమటికీ సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
ఓ ఊరికి దేవుడ్ని, దెయ్యాన్ని లింకుపెట్టడంతో కథపై ఆటోమేటిగ్గా ఆడియన్స్కి ఆసక్తి మొదలవుతుంది. ‘ఇది శివుడు అసురుడితో పోరాడిన కథ’ అంటూ సాయికుమార్ బేస్ వాయిస్తో సినిమా మొదలవ్వడంతో ఆడియన్స్ అంతా అలెర్ట్ అయిపోయారు. ఏఐ విజువల్స్, సాయికుమార్ బేస్ వాయిస్ తోడవ్వడంతో జనాలకు కథలోకి వెళ్లిపోయారు. ఇక కథ మొదలైనప్పట్నుంచి మిస్టీరియస్ విషయాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుండటంతో కథ చకచకా సాగిపోయింది. హీరో విక్రమ్(సాయికుమార్) పాత్ర ఎంటరైనప్పట్నుంచీ సైన్స్, శాస్త్రం మధ్య సాగే చర్చలా సినిమా సాగింది. ఈ వాదన ఈ సినిమాక్కూడా అవసరమే అయినా.. కాస్త డోస్ ఎక్కువైందనిపిస్తుంది. సైన్స్ని మాత్రమే నమ్మే హీరో.. శాస్ర్తాన్ని నమ్మడానికి బలమైన సన్నివేశాలనే రాసుకున్నాడు దర్శకుడు యుగంధర్ ముని. ఈ కథను అర్థవంతంగా తెరకెక్కించేందుకు దర్శకుడు యుగంధర్ ముని గట్టి కసరత్తులే చేశాడనిపిస్తుంది. సుషూమ్న నాడి అనే కొత్త పాయింట్ని తీసుకోవడం వల్ల కథలో ఆసక్తి రెట్టింపయ్యింది. దుష్టశక్తి ఆవహించిన వారిలో సుషూమ్న నాడి యాక్టివేట్ కావడం, వాళ్లు వికృతంగా తయారవ్వడం సినిమాకు ఓ కొత్త ఫ్లేవర్ తెచ్చిపెట్టింది. ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా ద్వితీయార్ధం సుషూమ్న నాడి చుట్టూనే తిరిగింది. ప్రీ ైక్లెమాక్స్లో వచ్చే మలుపు, అమ్మాయిని కాపాడేందుకు హీరో చేసే ప్రయత్నాలు.. దుష్టశక్తి ఊళ్లోవాళ్ల శరీరాల్లోకి ప్రవేశించడం, వారు చేసే వికృత చేష్టలు.. ఇలా కథంతా ఉత్కంఠ కలిగిస్తాయి. అయితే.. మొదట్లో సాయికుమార్ చెప్పిన ‘శివుడికీ అసురుడికీ జరిగిన యుద్ధం’ అనే అంశం ఎప్పుడొస్తుందా? అని అంతా ఎదురు చూశారు. దుష్టశక్తి ఉన్న ఆ ఊళ్లో దైవశక్తి కూడా ఉందని చెబుతుంటాడు దర్శకుడు. కానీ అక్కడ అంత కల్లోలం జరుగుతున్నా దేవుడెందుకు రాడు? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా ఇలాంటి కథలకు లాజిక్కులు వెతకకూడదు. మొత్తంగా అక్కడక్కడ కాస్త ల్యాగ్ అనిపించినా సినిమా అయితే ఓవరాల్గా బావుంది.
నటీనటులు
హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది సాయికుమార్ ఆశలు ఈ సినిమాతో ఫలించినట్టే అనాలి. ఈ పాత్రలో తను ఒదిగిపోయి నటించాడు. హీరోయిజం కోసం పాకులాడకుండా కథలో పాత్రలా మారిపోయి చక్కగా అభినయించాడు. హీరోయిన్ది పెద్ద క్యారెక్టర్ కాదు. మధునందన్, రవివర్మ ఉన్నంతలో బాగా చేశారు. ఇంకా సిజు, అన్నపూర్ణమ్మ కూడా చక్కని పాత్రలు పోషించారు.
సాంకేతికంగా
చిన్న సినిమా అయినా మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. వీఎఫ్ఎక్స్ బావుంది. ఏఐ ఎఫెక్ట్స్ బావున్నాయి. నేపథ్య సంగీతం బావుంది. దర్శకుడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా రాసుకున్నాడు. కథ, కథనాలు కూడా ఆసక్తికరంగా సాగాయి. కాకపోతే కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు ఇంకా బాగా తీయొచ్చేమో అనిపిస్తుంది. మొత్తంగా సగటు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలన్నీ శంబాలాలో ఉన్నాయి..
బలాలు
కథ, కథనం, గ్రాఫిక్స్, నటీనటుల నటన..
బలహీనతలు
కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపించడం..
రేటింగ్ : 3/5