‘ఈ కథ ఆలోచన సింగీతంగారికి చాలా ఏళ్ల క్రితమే వచ్చిందట. ఇలాంటి జానర్ ఇప్పటివరకూ రాలేదు. ఇందులో ప్రతి మాట మ్యూజికల్గా ఉంటుంది. సంభాషణలు కూడా పాటల్లా సాగుతాయి. కుబేరపురం అనే ఫిక్షనల్ గ్రామంలో జరిగే కథ ఇది. ఆ ఊరిలో ఏం జరిగింది? అందరూ ఎందుకు పాటల రూపంలో మాట్లాడుకుంటున్నారు? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. సింగీతం స్వయంగా పర్వవేక్షించారు. అలాగే నాగ్ అశ్విన్లోని సెన్సిబిలిటీ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది’ అంటున్నది కథానాయిక శాలిని కొండెపుడి. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతీమూవీస్, స్వప్న సినిమా పతాకాలపై నాగ్ అశ్విన్ నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘సింగ్ గీతం’. అయాన్, అహల్యా బమ్రూ, శాలినీ కొండెపుడి ముఖ్య పాత్రధారులు.
ఈ నెల 11న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా కథానాయికల్లో ఒకరైన శాలిని కొండెపుడి సోమవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడింది. ‘ఇంతకుముందు జయమ్మ పంచాయితీ, శుభం, మై డియర్ దొంగ చిత్రాలు చేశాను. ఈ సినిమాలో నాది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. అనుకున్నది సాధించాలనుకునే మనస్తత్వం ఉన్న మనిషిని. నమ్మిందే నిజమని భావించే పాత్ర నాది. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది’ అని తెలిపింది శాలిని. ఇంకా చెబుతూ ‘ఈ సినిమాలో నటించాలంటే అందరికీ కొంచెం శృతిలో పాటడం తెలిసుండాలి. అందుకే వర్క్షాప్స్ చేశాం. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. మాటలను పాటలుగా ఆయన మార్చిన తీరు అభినందనీయం’ అని పేర్కొన్నది శాలినీ కొండెపుడి.