Farzi Web-series | కరోనా పుణ్యమా అని ఓటీటీలకు ఎక్కడలేని ఆదరణ పెరిగింది. ఒకప్పుడు థియేటర్ల నుంచి వెళ్లిపోయిన సినిమా టీవీల్లో చూడాలంటే కనీసం మూడు నుంచి నాలుగు నెలలు సమయం పట్టేది. కానీ ఓటీటీలు వచ్చాక వారం, రెండు వారాల్లోనే అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రతీ వారం కొత్త సినిమా ఏది రిలీజవుతుందా అని తెగ వెతికేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ మధ్య వెబ్ సిరీస్ల ట్రెండ్ ఎక్కువైపోయింది. కంటెంట్ బాగుంటే ఐదారు గంటలైనా అలవోకగా చూసేస్తున్నారు. స్టార్ నటీనటులు కూడా వెబ్ సిరీస్లో నటించాలని తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే వెబ్ సిరీస్లో ముఖ్యమైన అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతాయి. దాంతో తమ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరుగుతుందని భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవలే రిలీజైన ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇండియన్ ఓటీటీ వేదికల్లో అత్యధికమంది వీక్షించిన వెబ్ సిరీస్గా రికార్డు నెలకొల్పింది. ది ఫ్యామిలీమ్యాన్ రూపకర్తలు రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ గత నెలలో విడుదలైంది. ముందు నుంచే ఈ వెబ్ సిరీస్పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. పైగా ది ఫ్యామిలీమ్యాన్ రూపకర్తల నుంచి వస్తున్న వెబ్ సిరీస్ కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి తోడు టీజర్, ట్రైలర్ కట్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో ఈ వెబ్సిరీస్పై ఎక్కడలేని బజ్ క్రియేట్ అయింది.
అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ను ఇప్పటివరకు 37 మిలియన్ల మంది వీక్షించారు. దీని తర్వాత స్థానాల్లో అజయ్ దేవగన్ రుద్ర(32.7 మిలియన్లు), పంచాయత్(29.6 మిలియన్లు) వ్యూవర్స్తో రెండు, మూడు ప్లేస్లలో ఉన్నాయి. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్లో విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించాడు. రాశీఖన్నా హీరోయిన్గా నటించింది.
ఎలాంటి పేయింటింగ్ నైనా అచ్చుగుద్దినట్లు గీయగలిగే గొప్ప కళాకారుడు షాహిద్ కపూర్. ఆయన గీస్తే ఏది ఓరిజినలో.. ఏది డూప్లికేటో అని కూడా తెలియదు. ఒకనొక సమయంలో తన తాత నడుపుతున్న పత్రిక అప్పుల పాలవడంతో దొంగ నోట్లను ముద్రించాలని ప్లాన్ చేస్తాడు. మరోవైపు దొంగనోట్ల అక్రమ రావాణాను అరికట్టే ప్రభుత్వ ఆఫీసర్గా విజయ్ సేతుపతి ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాంటి టైమ్లో షాహిద్ దొంగనోట్లను ఎలా మద్రించాడు. ఈ క్రమంలో షాహిద్కు ఎదురైనా సవాళ్లేంటి అనే నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇక ఈ వెబ్ సిరీస్కు సీక్వెల్ కూడా ఉండనున్నట్లు మేకర్స్ గతంలోనే వెల్లడించారు.