ఇటీవలే ‘జవాన్’ చిత్రంతో కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్నారు బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ఖాన్. దాంతో ఆయన తాజా చిత్రం ‘డంకీ’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు.
తాజాగా ఈ చిత్రంలోని ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ పాటను శుక్రవారం విడుదల చేశారు. విదేశాలకు వెళ్లాలని తాపత్రయ పడే నలుగురు స్నేహితుల భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ ఈ పాట హృద్యంగా సాగింది. మాతృదేశంపై వారికున్న మమకారానికి అద్దం పట్టింది. ‘యథార్ధ ఘటనలను ఆధారంగా చేసుకొని దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నలుగురి స్నేహితుల జీవిత ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించాం’ అని చిత్రబృందం పేర్కొంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజ్కుమార్ హిరాణీ, గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు..