Shah Rukh Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. హీట్ స్ట్రోక్ కారణంగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఐపీఎల్లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్ మంగళవారం కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ జట్ల మధ్య అహ్మదాబాద్లో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ను చూసేందుకు అహ్మదాబాద్ చేరుకున్నారు. స్థానికంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరగా.. షారుక్ వడదెబ్బకు గురైనట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నా.. వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ఆసుపత్రి చుట్టూ భారీ భద్రత కల్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
షారుక్ ఖాన్ను కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు. అయితే, దీనిపై ఆసుపత్రి అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా సంస్థ నివేదించింది. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ సహ యజమాని అయిన షారుక్ ఖాన్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించడంతో విజయోత్సవాలు జరుపుకున్నారు. పిల్లలు సుహానాఖాన్, అబ్రామ్తో కలిసి పాల్గొన్నారు. సెలబ్రెషన్కు సంబంధించిన ఫొటోలను ఇన్స్టా వేదికగా కేకేఆర్ అభిమానులతో పంచుకున్నది. మా లక్కీ చార్మ్.. మా కింగ్ ఖాన్ అంటూ పోస్టు పెట్టింది.