vani jayaram | చెన్నై: ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలు ఉండటంతో ఆమెది సహజ మరణమేనా లేక ఏమైనా కుట్ర జరిగిందా..? అని పలువురు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. వాణి జయరాం ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన మహిళ ఫ్లాట్ తలుపుతట్టగా లోపలి నుంచి స్పందన లేదు. ఆమె ఐదుసార్లు కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తీయలేదు.
దాంతో పనిమనిషి భర్త తన ఫోన్లోంచి వాణీ జయరాం ఫోన్కు కాల్ చేశాడు. అయినా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో అనుమానం వచ్చిన పనిమనిషి పోలీసులకు ఫోన్ చేసి, స్థానికుల సాయంతో గది తలుపులు బద్దలు కొట్టించింది. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే వాణీ జయరాం స్పృహ లేకుండా కింద పడిపోయి ఉన్నారు. ఆమె ముఖంపై ఎవరో కొట్టినట్టుగా తీవ్ర గాయాలున్నాయి.
వెంటనే పనిమనిషి, స్థానికులు కలిసి ఆమెను ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మరణించినట్లుగా నిర్ధారించారు. పనిమనిషి, స్థానికుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫ్లాట్ను ఆధీనంలోకి తీసుకుని అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఫ్లాట్లోని సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.