ఒకప్పుడు హీరోలు.. వెండితెరపై!
ఇప్పుడూ హీరోలే.. బుల్లితెరపై..!
అలనాడు అమితాబ్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’ అని ఏ ముహూర్తాన అన్నాడో కానీ,ఆయనతోపాటు ఎందరో హీరోలు బుల్లితెరపై, అటుపై ఓటీటీలోనూ మేము అన్స్టాపబుల్ అంటున్నారు. అందివచ్చిన అవకాశానికి తమ స్టార్డమ్ జతచేసి.. అందనంత అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. కోట్లాదిమందిని అలరిస్తున్నారు.
22 ఏండ్ల కిందట ఒకరోజు. స్టార్టీవీలో ‘దేవిఁయో ఔర్ సజ్ఁనో, చలియే హమ్ ఔర్ ఆప్ మిల్కర్ ఖేల్తే హై కౌన్ బనేగా కరోడ్పతి’ అంటూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పలికిన మాటలు ఇంటింటా మార్మోగాయి. రాత్రి తొమ్మిదైతే చాలు.. ఇంటిల్లిపాదీ టీవీలకు అతుక్కుపోయేవారు. వెండితెరపైఅమితాబ్ అధ్యాయానికి తెరపడింది అనుకుంటున్న రోజుల్లో ‘కేబీసీ’ అయన స్టార్డమ్ను అమాంతం పెంచేసింది. నెలల వ్యవధిలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
70వ దశకంలో స్టార్హీరోగా ఎంత బిజీగా ఉండేవాడో.. మళ్లీ అంత తీరికలేకుండా అయ్యాడు బచ్చన్. ఆయనకు అంతలా
కీర్తి తీసుకొచ్చిన ఘనత కౌన్బనేగా కరోడ్పతి (కేబీసీ)కే దక్కుతుంది. వరుసగా సినిమాలు చేస్తున్నా.. ‘కేబీసీ’ని కొనసాగించాడు. ప్రస్తుతం 14వ సీజన్ను జనరంజకంగా నిర్వహిస్తున్నాడు.
అప్పటివరకు బుల్లితెర నుంచి వెండితెరకు రావడమే తప్ప.. ఇక్కడి నటులు మళ్లీ టీవీకి వెళ్లిన దాఖలాలు చాలా అరుదు. అలా వెళ్తే ఏదో తక్కువన్న అపోహ కూడా ఉండేది. ఈ సంప్రదాయాన్ని అమితాబ్ బ్రేక్ చేసిన తర్వాత కూడా బాక్సాఫీస్ హీరోలు బుల్లితెర వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. దాదాపు పదేండ్ల కిందట హాస్యనటుడు అలీ పలు టెలివిజన్ కార్యక్రమాలకు యాంకర్గా మెప్పించాడు. ‘ఆలీ 369’, ‘ఆలీ టాకీస్’,‘ఆలీతో జాలీగా’, ‘ఆలీతో సరదాగా’ ఇలా ఏండ్లుగా టీవీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. హీరో సాయికుమార్ హోస్ట్గా వ్యవహరించిన ‘వావ్’, ‘మనం’ షోలు మంచి టీఆర్పీ రేటింగ్స్ సాధించాయి.
తెలుగునాట పెద్ద హీరో హోస్ట్గా మారింది మాత్రం 2014లో మొదలైన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంతోనే. ఈ షో తొలి సీజన్కు హీరో నాగార్జున యాంకర్గా వ్యవహరించాడు. అలా తెలుగులో బుల్లితెరపై మెరిసిన తొలి హీరోగా నాగార్జున నిలిచిపోయాడు. రెండో సీజన్కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్గా వ్యవహరించి షోకు సోకు పెంచాడు. మూడు, నాలుగు సీజన్లకు మళ్లీ నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. 2014 నుంచి 2017 వరకు నాలుగు సీజన్లుగా ప్రసారమైన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం మంచి టీఆర్పీ రేటింగ్ను సాధించింది. అప్పటికే ఫాలోయింగ్ ఉన్న హీరోలకు మరింత ఫ్యాన్బ్యాంక్ను పెంచింది అనడంలో సందేహం లేదు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా 2021లో ప్రసారమైన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ సూపర్ హిట్ అయింది. 60 ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించిన ఈ షోను జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో రక్తి కట్టించాడు.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు హీరోలను చేరువ చేసిన రియాలిటీ షో బిగ్బాస్. 2017లో మొదలైన ‘బిగ్బాస్’ ప్రతి సీజన్ విశేష ప్రేక్షకాదరణ పొందినదే! మొదటి సీజన్కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించాడు. 71 ఎపిసోడ్లుగా సాగిన సీజన్లో వారాంతం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా చేయడంలో జూ.ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. సమయస్ఫూర్తితో ఆయన షోను నిర్వహించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. 2018లో ‘బిగ్బాస్’ సెకండ్ సీజన్లో హోస్ట్ పాత్రలో నేచురల్ స్టార్ నాని కనిపించాడు. కూల్గా సీజన్ను ముగించాడు తను. 2019లో మూడో సీజన్ నుంచి గతేడాది ప్రసారమైన ఆరో సీజన్ వరకు నాగార్జున హోస్ట్గా అలరించాడు. శని, ఆదివారాల్లో ఆయన ఎంత హంగామా చేసేవాడో, హౌస్మేట్స్కు అంత కంగారు పుట్టించేవాడు. మొత్తంగా నాలుగు సీజన్లుగా బిగ్బాస్ను నడిపిస్తూనే.. ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు కింగ్ నాగార్జున. హిందీలో బిగ్బాస్ షోకు సల్మాన్ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. తమిళంలో కమల్హాసన్, మలయాళంలో మోహన్లాల్ సైతం బిగ్బాస్ హోస్ట్ల అవతారమెత్తి టీవీలో ఠీవిగా కనిపిస్తున్నారు.
ఓటీటీ సంస్కృతి మొదలయ్యాక సినీజీవులు ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అవకాశాలు పెరిగాయి. ఈ క్రమంలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలకు హీరోలు, హీరోయిన్లు హోస్ట్లుగా వ్యవహరించి తమ సత్తా చాటారు. ‘సామ్జామ్’తో సమంత, ‘నంబర్ వన్ యారీ’తో రానా సక్సెస్ఫుల్ యాంకర్లుగా నిరూపించుకున్నారు. తాజాగా నటసింహం బాలకృష్ణ ఓటీటీలో సూపర్హీరో అనిపించుకుంటున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’లో ఆయన హోస్ట్ చేస్తున్న ‘అన్స్టాపబుల్’ కార్యక్రమం స్ట్రీమింగ్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. 2021 నవంబర్లో మొదలైన ఈ టాక్ షో బాలకృష్ణలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది అనడంలో సందేహం లేదు.
మొదటి సీజన్లో పది ఎపిసోడ్లు మాత్రమే స్ట్రీమింగ్ అయ్యాయి. గతేడాది అక్టోబర్లో రెండో సీజన్ మొదలైనప్పటి నుంచి ‘అన్స్టాపబుల్’ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. ప్రతి ఎపిసోడ్కు ప్రత్యేక అతిథులను రప్పిస్తూ, వారితో సరదాగా సంభాషిస్తూ, ఆడిస్తూ బాలకృష్ణ చేస్తున్న సందడిని అందరూ ఆదరిస్తున్నారు. కొత్త ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మొన్నటికి మొన్న ప్రభాస్ ఎపిసోడ్ సమయంలో నెట్ ట్రాఫిక్ జామ్ కావడాన్ని బట్టి.. అన్స్టాపబుల్కు ఏ స్థాయిలో ఆదరణ లభిస్తున్నదో ఊహించుకోవచ్చు. మొత్తంగా వెండితెర మీదే కాదు.. బుల్లితెరపైనే కాదు.. ఓటీటీల్లోనూ మేమే మేటి అని నిరూపిస్తున్నారు మన హీరోలు.