Ram Gopal Varma | ప్రముఖ నటుడు, సింగర్ దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సత్లుజ్’ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్కు చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా దర్శకుడు హనీ ట్రెహాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1995లో అపహరణకు గురై బలవంతపు ఎన్కౌంటర్కు బలైన ఖల్రా కథతో మొదట ‘పంజాబ్ 95’ పేరుతో ఈ సినిమా రూపొందింది. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి ఏకంగా 127 కట్స్ ప్రతిపాదించడంతో, మేకర్స్ థియేటర్ విడుదలను కాదని నేరుగా ఓటీటీ బాట పట్టారు. ఎలాంటి సెన్సార్ కోతలు లేకుండా ‘సత్లుజ్’ అనే కొత్త పేరుతో జూలై 3న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈ చిత్రం విడుదలైంది. అయితే ఐటీ రూల్స్ ఉల్లంఘనలు, భద్రతా కారణాలను ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కేవలం రెండు రోజులకే ఈ సినిమాను ప్లాట్ఫామ్ నుండి అకస్మాత్తుగా తొలగించారు. ప్రస్తుతం ఇది భారత్ వెలుపల మాత్రమే అందుబాటులో ఉంది. మరోవైపు ఈ నిషేధాన్ని తాను ముందే ఊహించానని దిల్జీత్ దోసాంజ్ ఇన్స్టాగ్రామ్ పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా చూసిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సత్లుజ్’ కేవలం సినిమా మాత్రమే కాదని, మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాన్ని గుర్తుచేస్తూ ఎన్నటికీ మానని ఒక లోతైన గాయాన్ని రేపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ ఎటువంటి హీరోయిజం చూపించకుండా, కేవలం ఒక అంతరాత్మను ఆయుధాలుగా చేసుకుని అద్భుతంగా నటించారని కొనియాడారు. అలాగే కుళ్ళిపోయిన సమాజానికి అద్దం పడుతూ అర్జున్ రాంపాల్ పోషించిన పాత్ర అత్యంత భీతిగొలిపేలా, సహజంగా ఉందన్నారు.
దర్శకుడు హనీ ట్రెహన్ ఈ భయానక వాతావరణాన్ని ఎక్కడా సంచలనాత్మకం చేయకుండా ఒక స్లో-బర్న్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లా మలిచారని వర్మ ప్రశంసించారు. ఒక ప్రజాస్వామ్యం తన స్వంత పౌరులనే ఎలా మింగేస్తుంది, ఆపై దానికి సంబంధించిన సాక్ష్యాలను చెరిపివేయడానికి ఎలా ప్రయత్నిస్తుందనే కోణాన్ని ఎక్కడా ఉపన్యాసాలు ఇవ్వకుండా చూపించడం మామూలు విషయం కాదని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. అలాగే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఏ కళ అయినా విజయం సాధించినట్లేనని.. ప్రస్తుతం ‘సత్లుజ్’ ఎదుర్కొంటున్న సమస్యలే దీనికి నిదర్శనమని ఆర్జీవీ పేర్కొన్నారు. నేటి మెయిన్ స్ట్రీమ్ సినిమాలు కేవలం వినోదం కోసం పరుగెడుతుంటే, ఒక నిజాయితీ గల సినిమా ఎంతటి అద్భుతాలు సృష్టించగలదో ఈ చిత్రం నిరూపించిందన్నారు. ‘సత్లుజ్’ను ప్రతి ఒక్కరూ చూసి చర్చించాలని కోరిన వర్మ, చిత్రంలోని బాధితులకు జరిగినట్లుగా ఈ సినిమాకు కూడా ‘ఎన్కౌంటర్’ ముగింపు ఇవ్వవద్దని, జస్వంత్ సింగ్ ఖల్రాకు చేసిన అన్యాయాన్ని దీనికి చేయవద్దని అధికార వర్గాలకు విజ్ఞప్తి చేశారు. సత్యాన్ని దాచాలని చూస్తే అది మరింత బలంగా తిరగబడుతుందని ఆయన ముగించారు.