Satendra Soni | ‘లాపతా లేడీస్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు సతేంద్ర సోని చేసిన సంచలన ఆరోపణలు ప్రస్తుతం బాలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మధ్యప్రదేశ్లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆయన, దర్శకుడు తనను చంపేస్తానని బెదిరించడమే కాకుండా నడిరోడ్డుపై దాడి చేశాడని ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని మైహర్ ప్రాంతంలో తెరకెక్కుతున్న ‘పేడ్ పాల్కి’ చిత్రంలో సతేంద్ర సోని నటిస్తున్నారు. ‘అజ్మీర్ 92’ దర్శకుడు పుష్పేంద్ర సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.
షూటింగ్కు ముందుగా అడ్వాన్స్గా రూ.50 వేలు చెల్లించిన యూనిట్, మిగిలిన పారితోషికాన్ని షూటింగ్ సమయంలో ఇస్తామని హామీ ఇచ్చినట్లు సతేంద్ర వెల్లడించారు. మొత్తం 10 రోజుల షూటింగ్ షెడ్యూల్లో భాగంగా ఎనిమిది రోజుల పాటు పనిచేసిన అనంతరం తన రెమ్యునరేషన్ గురించి అడగగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని ఆయన తెలిపారు. డబ్బులు ఇవ్వకుండా వెంటనే హోటల్ ఖాళీ చేయాలని, లేకపోతే చంపేస్తామని దర్శకుడు బెదిరించాడని సతేంద్ర ఆరోపించారు. సతేంద్ర తెలిపిన వివరాల ప్రకారం, దర్శకుడు పుష్పేంద్ర సింగ్తో పాటు ఆయన భార్య, నటి ప్రగతి చౌహాన్ కూడా తనను అవమానకరంగా దూషించారని పేర్కొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తాను సహనటులు శ్రీధర్ దూబే, పంకజ్ శర్మతో కలిసి హోటల్ను విడిచి వెళ్లిపోయినట్లు చెప్పారు.
అయితే అక్కడితో వ్యవహారం ముగియలేదని, కారులో వెంబడించి నడిరోడ్డుపై తనపై దాడి చేశారని సతేంద్ర ఆరోపించారు. తనను కాపాడేందుకు వచ్చిన సహనటుడు శ్రీధర్ దూబేపై కూడా దాడి జరిగినట్లు ఆయన వెల్లడించారు. సినిమా యూనిట్లో పలువురికి సరైన పారితోషికం అందలేదని కూడా సతేంద్ర తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. చిన్న నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఈ సంఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఘటన అనంతరం ఎలాగోలా ముంబై చేరుకున్న సతేంద్ర మరో వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు. తమకు సహాయం చేసిన మధ్యప్రదేశ్ పోలీసులకు, స్నేహితులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సతేంద్ర సోని ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘డాక్టర్ జీ’, వరుణ్ ధావన్ ‘బవాల్’, నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘రాత్ అకేలీ హై’ వంటి చిత్రాల్లో కనిపించారు. అలాగే టెలివిజన్ షో ‘హలో బచ్చోన్’ ద్వారా కూడా ప్రేక్షకులకు చేరువయ్యారు.