‘బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసి బహుజనవీరుడిగా సర్దార్ సర్వాయి పాపన్న ఖ్యాతి గడించారు.300 ఏళ్ల క్రితంనాటి ఆయన చరిత్రను నేటి సమాజానికి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది’ అని అన్నారు పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్. ‘కింగ్ ఆఫ్ గోల్కొండ’ చిత్ర టైటిల్ లోగోను బుధవారం హైదరాబాద్లో ఆయన విడుదలచేశారు. ఈ చిత్రానికి ప్రతాని రామకృష్ణగౌడ్ దర్శకుడు. పల్లె లక్ష్మణ్రావుగౌడ్ నిర్మాత. వంశీ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ‘ఆనాటి రాజుల దౌర్జన్యాల్ని, దోపిడిలను ఎదురించి సర్దార్ సర్వాయి పాపన్న పోరాడారు. 33 కోటలను జయించడమే కాకుండా సామాన్యుడు రాజు కావచ్చునని నిరూపించారు. పాపన్న చరిత్రను వెలుగులోకి రాకుండా ఎంతో మంది ప్రయత్నించినా అగ్నిపర్వతంలా ఎగిసిపడుతూనే ఉంది. ఈ సినిమా రూపకల్పనలో ఆర్.కె. గౌడ్ బృందం అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. చాలా అధ్యయనం చేసి జాగ్రత్తగా సినిమాను రూపొందించాలి. ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదు. పేద అట్టడుగు వర్గాలు, జాతులు ఎదిగేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తున్నారు’ అని తెలిపారు. నవాబుల అన్యాయాల్ని ఎదురించి బహుజనులకు సర్వాయి పాపన్న ఎలా ఆరాధనీయుడిగా నిలిచారో ఈ సినిమాలో చూపించబోతున్నామని, యాభై కోట్ల బడ్జెట్తో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నామని దర్శకుడు ఆర్.కె. గౌడ్ అన్నారు.