రాజా రవీంద్ర ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఉమాదేవి, శరత్చంద్ర నిర్మాతలు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రంలోని ‘అందుకోవా..’ అంటూ సాగే గీతాన్ని నటుడు నవీన్చంద్ర విడుదల చేసి, చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు అందించారు.
రాంబాబు గోశాల రాసిన ఈ గీతాన్ని ఎం.ఎబెనెజర్ పాల్ స్వరపరచగా, విఖ్యాత గాయని కె.ఎస్.చిత్ర ఆలపించారు. లక్ష్యసాధన విషయంలో స్పూర్తి నింపేలా ఈ గీతం సాగుతుందని మేకర్స్ తెలిపారు. మధ్యతరగతి కుటుంబాల సంఘర్షణల నేపథ్యంలో కథ నడుస్తుందని, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు ఇలా అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని దర్శకుడు తెలిపారు. శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్, మోహిత్, నీల ప్రియా, కాదంబరి కిరణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: వినయ్ కొట్టి, కెమెరా: సిద్ధార్థ స్వయంభు.