ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ ఉపవాసదీక్షలు బుధవారం తెల్లవారు జాము నుంచి ప్రారంభించారు. కొవిడ్ నేపథ్యంలో రంజాన్ ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ముస్లింలు భౌతిక దూరం పాటిస్తూ తొలి రోజు సామూహిక ప్రార్థనలు చేశారు. దీంతో ముస్లిం కుటుంబాలు అత్యధికంగా నివాసముంటున్న అంబర్పేట, బాగ్అంబర్పేట, గోల్నాక తదితర ప్రాంతాల్లో రంజాన్ మాసం కళ ఉట్టిపడుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మసీదులను రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆయా మసీదుల వద్ద మౌలిక సదుపాయాల కోసం జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యు త్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన బాగ్అంబర్పేట తురాబ్నగర్ బడీమసీదులో ఒకే సారి పదివేల మంది నమాజు చేసుకునే వీలుండగా ఈ సారి సామూహిక ప్రార్థనల్లో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పాటు అంబర్పేట బాపునగర్, చెన్నారెడ్డినగర్, పటేల్నగర్, సీపీఎల్ రోడ్, గోల్నాక లోని జిందాతిలస్మాత్ మసీదు, బాగ్అంబర్పేట జంజం మసీదుల్లో రంజాన్ సందడి షురూ అయ్యింది.
రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేసే ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇస్తుంటారు. రాజకీయ నాయకులు, అభిమానులు, కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులు ఇస్తారు. అంబర్పేట నియోజకవర్గంలోని దాదాపు అన్ని మసీదుల్లో వినూత్న రీతిలో పోటాపోటీగా విందులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపవాస దీక్షలో ఉన్న మస్లింలకు రోజుకు ఒకరు చొప్పున దాతలు ముందుకు వచ్చి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారు. ఆర్థిక స్తోమత ఉన్న వారు బంధువులు, మిత్రులకు ఇఫ్తార్ విందు ఇవ్వడంతో పాటు నిరుపేదలకు డబ్బులు, దుస్తులు పంపిణీ చేస్తారు. ఈ నెల 14 నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం కావడంతో కొవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నియోజకవర్గంలోని పలువురు సాయంత్రం వేళలో ఇఫ్తార్ విందు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.