క్విట్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న దేశభక్తి చిత్రం ‘ఏ వతన్ మేరే వతన్’లో ప్రధాన పాత్రను పోషిస్తున్నది సారా అలీఖాన్. కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా అలీఖాన్ ఈ సినిమా సంగతులను పంచుకుంది. ఇండిపెండెన్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడానికి 365 రోజులు సరిపోవని, ప్రతిక్షణం స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాలను గుర్తుచేసుకొని దేశ ఉన్నతికోసం పాటు పడాలని ఆమె పిలుపునిచ్చింది.
‘భారత చరిత్ర, స్వాతంత్య్ర సంగ్రామంలో మనకు తెలియని ఎన్నో పార్శాలున్నాయి. వాటి గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందరో త్యాగధనుల ధైర్యసాహసాల ఫలితంగా ఈ రోజు మనం స్వేచ్ఛగా ఉన్నాం. ఈ విషయాన్ని మనందరం ప్రతీ రోజు గుర్తు చేసుకోవాలి’ అని సారాఅలీ ఖాన్ పేర్కొంది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని దేశానికి స్ఫూర్తివంతంగా నిలిచిన ఓ యువతి కథతో ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు మర్డర్ ముబారక్ అనే చిత్రాల్లో సారా అలీఖాన్ నటిస్తున్నది.