సంతోష్ శోభన్ హీరోగా నటించిన రొమాంటిక్ లవ్స్టోరీ ‘కపుల్ ఫ్రెండ్లీ’. మానస వారణాసి కథానాయిక. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది. నిర్మాత ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. చిత్ర పంపిణీదారుడు ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘సెన్సార్వారు చెప్పినట్టు టైటిల్ మార్చకపోవడంతో ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. నిజానికి ఇది ప్యూర్ లవ్స్టోరీ. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని వర్గాలూ ఇబ్బంది లేకుండా ఈ సినిమా చూడొచ్చు.
ఈ సినిమా సంతోష్శోభన్కి మంచి బ్రేక్ అవుతుంది. అలాగే కథానాయిక మానస వారణాసి తన పాత్రకు జీవం పోసింది. రెండు తెలుగు రాష్ర్టాల్లోని ముఖ్యపట్టణాల్లో ఈ నెల 13న సాయంత్రం నుంచే ప్రీమియర్లు మొదలవుతాయి’ అని తెలిపారు. మిత్ర పరిచయం శివ జీవితాన్ని ఎలా మార్చింది? మిత్ర ప్రేమకోసం శివ ఎంతదాకా వెళ్లాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా అనీ, ఇది ఓ జంట ప్రయాణమనీ, అంచనాలకు తగ్గట్టు విజయం కూడా ఈ సినిమాకు దక్కాలని సంతోష్ శోభన్ ఆశాభావం వెలిబుచ్చారు. టీమ్ వర్క్ అంటే ఏంటో ఈ సినిమా షూటింగ్లో చూశానని కథానాయిక మానస వారణాసి చెప్పారు.