సంతోష్ శోభన్, గౌరి జి. కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి శోభన్బాబు’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడు. సుస్మిత కొణిదెల, విష్ణుప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన సమావేశంలో సుస్మిత కొణిదెల మాట్లాడుతూ ‘నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమిది. చిన్న ఆలోచనతో ఈ సినిమాను మొదలుపెట్టాం. టీమ్ అంతా కష్టపడి పనిచేశాం. గ్రామీణ నేపథ్య కథలో సంతోష్శోభన్ అద్భుతంగా నటించాడు. ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రంగా అందరిని మెప్పిస్తుంది’ అన్నారు. 1970 నేపథ్యంలో అందంగా సాగే ప్రేమకథా చిత్రమిదని, ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని సంతోష్ శోభన్ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసిన తర్వాత మన కుటుంబ సభ్యులందరిని కలుసుకుంటే బాగుండనిపిస్తుంది. ప్రతి పాత్ర సహజంగా ఉంటుంది. మరచిపోతున్న అనుబంధాల్ని గుర్తుకు తెచ్చే చక్కటి చిత్రమిది’ అన్నారు. తెలుగులో తనకిది తొలి చిత్రమని, గ్రామీణ కథలో నటించడం ఆనందంగా ఉందని కథానాయిక గౌరి జి కిషన్ తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.