Obsession | కేవలం రూ.9 కోట్ల బడ్జెట్తో మొదటిరోజే వరల్డ్ వైడ్గా రూ.950 కోట్ల వసూళ్లను సాధించి హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ‘అబ్సెషన్’ (Obsession) చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ‘ఎ’ (A-Rated) సర్టిఫికేట్ పొందిన హాలీవుడ్ హర్రర్ చిత్రం ‘అబ్సెషన్’ (Obsession) ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రాన్ని చూడటానికి మైనర్ పిల్లలు ( 18 ఏండ్ల కంటే తక్కువ) భారీ సంఖ్యలో థియేటర్లకు వస్తున్నారని సంజయ్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన ఒక మలయాళ సినిమాను చూసేందుకు తాను థియేటర్కు వెళ్లానని, ఆ స్క్రీన్లో కేవలం తాను ఒక్కడినే ఉన్నానని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అయితే అదే థియేటర్లోని పక్క స్క్రీన్లో ప్రదర్శితమవుతున్న ‘అబ్సెషన్’ సినిమాకు తన కుమారుడు వెళ్లాడని, అక్కడ థియేటర్ మొత్తం పిల్లలతో నిండిపోయిందని ఆయన తెలిపారు. వారిలో చాలా మంది 18 ఏండ్ల కంటే తక్కువ వయసు వారే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందని, అయితే ‘ఎ’ రేటింగ్ ఉన్నప్పటికీ మైనర్లు ఎలా లోపలికి ప్రవేశిస్తున్నారనే దానిపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘అబ్సెషన్’ చిత్రం తీవ్రమైన హింస మరియు అడల్ట్ కంటెంట్ కారణంగా సెన్సార్ బోర్డ్ నుంచి దాదాపు 38 సెకన్ల కీలక సీన్ల కత్తెరకు గురైనప్పటికీ, సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ల యాజమాన్యాలు నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.