‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’. ‘90s వెబ్ సిరీస్’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. సోమవారం ఈ సినిమా నుంచి ప్రముఖ గీత రచయిత, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రచించిన ‘సంచారమే’ అనే గీతాన్ని విడుదల చేశారు. ‘సంచారమే ఎంతో బాగున్నది. దీనంత ఆనందమేమున్నది. ఊరూ నిడిశీ గాలి మోటారెక్కీనాది, మోటూ మనషుల నిడిశి..’ అంటూ స్వదేశం, విదేశీ జీవితాలకు మధ్య ఉన్న వైరుధ్యాలను ఆవిష్కరిస్తూ జానపద శైలిని స్ఫురిస్తూ ఈ పాట సాగింది.
హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ పాటను స్వరపరచడంతో పాటు గోరటి వెంకన్నతో కలిసి ఆలపించారు. లండన్ అందాల నేపథ్యంలో నాయకానాయికల ప్రణయానికి అద్దం పడుతూ మెలోడీ ప్రధానంగా ఈ పాట సాగింది. సున్నితమైన భావోద్వేగాలు కలబోసిన ప్రేమకథాచిత్రమిదని, యువ హృదయాల అమాయకత్వం, ప్రేమలో వారి సంఘర్షణను ఆవిష్కరిస్తూ మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, రచన-దర్శకత్వం: ఆదిత్య హాసన్.